
రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారం కల్పించే కీలక బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించడంపై భారత్ స్పందించింది. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోందని, దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
రష్యా నుంచి భారీగా చమురు సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఈ బిల్లు కల్పిస్తుంది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాలపై కూడా ఈ సుంకాల ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. దేశ జాతీయ ప్రయోజనాలు 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకునే భారత్ తన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది. అమెరికాతో ఈ అంశంపై వివిధ స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించింది.
అమెరికా ప్రతినిధుల సభ ఈ బిల్లును 262–159 ఓట్ల తేడాతో ఆమోదించింది. ప్రస్తుతం బిల్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వెళ్లింది. దీనిపై సంతకం చేస్తానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టంగా మారుతుంది.
అయితే చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వం దాని నిబంధనలను ఏ విధంగా అమలు చేస్తుంది ఏ దేశాలపై ఎలాంటి సుంకాలు విధిస్తుంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. భారత్పై ప్రత్యక్ష ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది కూడా అమెరికా తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

