
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిగా ఆలపించారు. ఎర్రకోటపై వందేమాతరాన్ని సంపూర్ణంగా ఆలపించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
ఆ తర్వాత జాతీయ గీతం ‘జన గణ మన’ను ఆలపించగా భారత వాయుసేనకు చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఆకాశంలో విన్యాసాలు చేస్తూ పూలవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ జెండాను, మరో హెలికాప్టర్ ‘వందేమాతరం’ అని రాసిన పతాకాన్ని మోసుకెళ్లి వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. ‘వందేమాతరం’ గేయం 150వ వార్షికోత్సవం సందర్భంగా గతేడాది నవంబర్ 7 నుంచి ఏడాది పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో జాతీయ గీతం ‘జన గణ మన’తో సమాన హోదా కల్పిస్తూ ‘వందేమాతరం’కు సంబంధించి కేంద్రం కీలక చట్టపరమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ప్రకారం వందేమాతరాన్ని అవమానించడం లేదా గేయం ఆలపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. ‘వందేమాతరం’ గేయాన్ని తొలిసారిగా 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు.
