
BRICS సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్కు ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని మోదీ బహుమతిగా అందించారు.
భారత్-రష్యాల మధ్య కొనసాగుతున్న సాహిత్య, తాత్విక అనుబంధానికి ఈ కానుక ప్రతీకగా నిలిచింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ 2026లో ప్రచురించిన ఈ ప్రత్యేక సంచికలో మూల తమిళ పద్యాలతో పాటు వాటి ట్రాన్స్లిటరేషన్, రష్యన్ అనువాదం ఉన్నాయి. ఈ అనువాదాన్ని నైరా మ్కర్ట్చ్యాన్ రూపొందించారు.
భారతీయ తత్వశాస్త్రంపై రష్యా రచయితలు, మేధావుల్లో శతాబ్దాలుగా ఆసక్తి కొనసాగుతోంది. యూరోపియన్ భాషల్లోకి అనువాదమైన ‘తిరుక్కురళ్’ ద్వారా రష్యన్ పండితులకు కూడా ఈ ప్రాచీన గ్రంథంతో పరిచయం ఏర్పడింది.
ప్రముఖ రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ 19వ శతాబ్దంలోనే ‘తిరుక్కురళ్’ చదివినట్లు భావిస్తారు. గ్రంథంలోని ధర్మం, దయ, అహింస వంటి భావనలు ఆయన తాత్విక ఆలోచనలపై ప్రభావం చూపినట్లు చెబుతారు. 20వ శతాబ్దం ప్రారంభంలో టాల్స్టాయ్, మహాత్మా గాంధీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ ‘తిరుక్కురళ్’ ప్రస్తావన వచ్చినట్లు విశ్వాసం ఉంది.
ఈ గ్రంథాన్ని చదవాలని టాల్స్టాయ్ గాంధీజీకి సూచించారని, తద్వారా గాంధీజీ అహింసా సిద్ధాంత రూపకల్పనకు ఇది కొంతమేర ప్రేరణనిచ్చిందని చెబుతారు. పుతిన్కు ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాదాన్ని బహుమతిగా ఇవ్వడం ద్వారా భారత్-రష్యా సంబంధాల్లో రాజకీయ, దౌత్య అంశాలతో పాటు సాహిత్య, సాంస్కృతిక బంధాలకు కూడా ప్రాధాన్యం ఉందనే సందేశాన్ని మోదీ చాటారు.
