
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భవిష్యత్ పాత్రపై రాజకీయ చర్చ మొదలైంది. ఇస్రోను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ఆరోపించారు. ఆరు దశాబ్దాలుగా ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషితో అభివృద్ధి చేసిన సామర్థ్యాలు మౌలిక వసతులను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.
రాకెట్ల తయారీ ప్రయోగ వాహనాల ఉత్పత్తి వంటి కీలక విభాగాల్లో ఇస్రో పాత్రను క్రమంగా తగ్గించి ప్రైవేట్ సంస్థలకు మరింత బాధ్యతలు అప్పగించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని జైరాం రమేశ్ ఆరోపించారు. ఇస్రో భవిష్యత్ పాత్రకు సంబంధించి ఇటీవల వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ అంతరిక్ష సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయి ప్రతిభను భారత్కు ఆకర్షించేలా బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇస్రో పాత్రపై చర్చకు తెరలేచింది.
ప్రయోగ వాహనాల తయారీ, సాధారణ ఉపగ్రహాల తయారీ వంటి కార్యకలాపాల నుంచి ఇస్రో క్రమంగా దూరమవుతూ పరిశోధన అధునాతన సాంకేతికత మిషన్ల రూపకల్పనపై మరింత దృష్టి సారించే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇస్రో సామర్థ్యాల ప్రైవేటీకరణపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.
