
హైదరాబాద్లోని సనత్నగర్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్) ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆస్పత్రిని ప్రారంభించనున్నారు.
ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో 22.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,070 కోట్ల వ్యయంతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. మే నెల నుంచి ఇక్కడ ఓపీ సేవలను ట్రయల్ రన్గా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 200 నుంచి 250 మంది వరకు రోగులు వైద్య సేవలు పొందుతున్నారు.
గతేడాది డిసెంబర్ 9న, అనంతరం ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఆస్పత్రిని ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రస్తుతం పనులు పూర్తికావడంతో ఈ నెల 17న ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
1,082 పడకల సామర్థ్యంతో సనత్నగర్ టిమ్స్ను నిర్మిస్తున్నారు. తొలిదశలో 582 పడకలతో వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన 500 పడకలను అక్టోబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
టిమ్స్ ప్రధానంగా నాలుగు కీలక వైద్య విభాగాలకు ప్రత్యేక కేంద్రంగా పనిచేయనుంది. కార్డియాక్, నెఫ్రాలజీ-యూరాలజీ, అవయవ మార్పిడి, ట్రామా విభాగాల్లో అధునాతన వైద్య సేవలు అందించనున్నారు. వీటికి అనుసంధానంగా మరో 37 వైద్య విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.
నిమ్స్ తరహాలోనే టిమ్స్కు స్వయం ప్రతిపత్తి హోదా ఉండనుంది. దీంతో ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన నిధులను సంస్థ సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రారంభ దశలో సుమారు ఐదారేళ్ల పాటు ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం అందించనుంది.
