
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రెండు పార్టీలు అడ్డుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిపై ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బుల్లెట్ప్రూఫ్ బస్సుల్లో ఫాంహౌస్లకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపించారు. భూముల రికార్డులన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడు వాటిని పరిశీలించేందుకు మళ్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై స్పందిస్తూ దానం నాగేందర్కు బైఎలక్షన్ కలిసి వచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఖైరతాబాద్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరుగా కనిపించినా ఒకే తాను ముక్కలని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్రెడ్డిపై కూడా రఘునందన్ రావు విమర్శలు చేశారు.
తెలంగాణలో నిజాం పాలనపై ఇద్దరూ సానుకూలంగా మాట్లాడిన సందర్భాలకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. నిజాం పాలనను ప్రశంసించడం ద్వారా చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. నిజాం పాలనలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ ఆదివాసీలు మహిళలు ఎదుర్కొన్న సమస్యలను రఘునందన్ రావు ప్రస్తావించారు.
బైరాన్పల్లి ఘటనతో పాటు నిజాం పాలనకు వ్యతిరేకంగా కొమురం భీమ్, రాంజీ గోండు, కొండా లక్ష్మణ్ బాపూజీ, నారాయణరావు పవార్, రామానంద తీర్థ, ఆర్య సమాజ్ తదితరులు చేసిన పోరాటాలను గుర్తుచేశారు. నిజాం గొప్పవారైతే సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో కూడా తప్పేనని చెప్పగలరా? అని ప్రశ్నించారు.
