
హైదరాబాద్ (డి న్యూస్ బిజినెస్): హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ అడుగుపెట్టింది. ట్రెబెకా డెవలపర్స్, ఇరా రియల్టీ భాగస్వామ్యంతో కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్లో ‘ట్రంప్ టవర్స్’ పేరుతో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ను చేపట్టింది.
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 65 అంతస్తులతో రెండు టవర్లను నిర్మించనున్నారు. మొత్తం 22 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో 16 పెంట్హౌస్లతో పాటు 450 లగ్జరీ అపార్ట్మెంట్లు అందుబాటులోకి రానున్నాయి.
భూమి ఖర్చును మినహాయించి ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ట్రెబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా తెలిపారు. ఈ ఏడాది చివర్లో నిర్మాణ పనులు ప్రారంభించి, నాలుగేళ్లలో ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
భారత్లో ఇది ట్రంప్ బ్రాండ్కు సంబంధించిన ఎనిమిదో ప్రాజెక్ట్ కాగా, దక్షిణ భారత్లో ఇదే తొలి ప్రాజెక్ట్ అని కంపెనీ తెలిపింది. 2014లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ట్రంప్ బ్రాండ్ ఇప్పటికే ముంబై, పుణె, గురుగ్రామ్, నోయిడా, కోల్కతాల్లో ప్రాజెక్టులను చేపట్టింది. హైదరాబాద్ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోని లగ్జరీ రియల్టీ మార్కెట్లో తమ విస్తరణను మరింత వేగవంతం చేయాలని ట్రెబెకా డెవలపర్స్ భావిస్తోంది.
