
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ 7.8 శాతం వృద్ధి నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి దేశ ప్రజల సంకల్పమే కారణమని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని మోదీ గుర్తుచేశారు. సప్లై చైన్లు దెబ్బతినడంతోపాటు, 2020లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు పూర్తిస్థాయిలో స్థిరపడలేదన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు.
భారత్ సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని చూసి కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మోదీ విమర్శించారు. అయితే, అలాంటి ప్రచారాలను ప్రజలు పటాపంచలు చేస్తూ దేశాన్ని వృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
భవిష్యత్తులో దేశ ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేయాలంటే ఆత్మనిర్భర భారత్ సాధించడం అత్యవసరమని ప్రధాని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ‘వోకల్ ఫర్ లోకల్’గా మారాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అవసరం లేని విదేశీ ప్రయాణాలను తగ్గించాలని, విదేశాల్లో వివాహాలు నిర్వహించకుండా దేశీయంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయకుండా ఉండాలని కోరారు.
ఆత్మనిర్భరతకు పెద్దపీట వేస్తే 2047 నాటికి భావితరాలకు వికసిత భారత్ను అందించగలమన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు. యువత ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
