
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్ల టీషర్టులు, ఫ్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తెలంగాణ భవన్కు తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ అసెంబ్లీ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
మరోవైపు ఈ ఘటనపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి రావడం నేరం కాదని, అయితే వాటిపై అభ్యంతరకర పదాలు ఉండటంతో వారిని లోపలికి అనుమతించలేదని తెలిపారు. తాము ఎవరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.
పోలీసులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలను పరిశీలిస్తామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను కూడా పరిశీలిస్తామని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన సూచనల మేరకే పోలీసులు వ్యవహరించారని ఆమె వెల్లడించారు.
