
తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యావేత్తలు, ప్రతినిధులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
విద్య, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారం, హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి విద్యా కార్యక్రమాల నిర్వహణ, సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విజ్ఞాన, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను ప్రతినిధులు కేంబ్రిడ్జ్ బృందానికి వివరించారు.
హైదరాబాద్లో విద్యా కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంబ్రిడ్జ్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని మానవ వనరులు, సాంకేతిక సామర్థ్యాలు, పరిశ్రమలు, స్టార్టప్ ఎకోసిస్టమ్పై కూడా ప్రతినిధులు వివరించారు. అదేవిధంగా సంయుక్త పరిశోధనలు, ఇంక్యుబేషన్ కార్యక్రమాలు, స్టార్టప్ల అభివృద్ధి, యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం, అంతర్జాతీయ అవకాశాల కల్పనపై ఇరుపక్షాలు చర్చించాయి.
తెలంగాణ యువతలోని ప్రతిభను ప్రపంచస్థాయి వేదికలకు తీసుకెళ్లేందుకు సహకరించేందుకు కేంబ్రిడ్జ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు ఉన్న అవకాశాలపై కేంబ్రిడ్జ్ విద్యావేత్తలు కూడా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, భాగస్వామ్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.
ఈ భాగస్వామ్యం సాకారమైతే హైదరాబాద్ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్లకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంది.
