
చరిత్రను తెలుసుకున్న వారే భవిష్యత్తును మరింత మెరుగ్గా నిర్మించగలరని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత జాతీయ జెండాను ఎగురవేసి, అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
బ్రిటీష్ పాలనలో జరిగిన అకృత్యాలు, వారు అనుసరించిన ‘విభజించి పాలించు’ విధానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో భారతీయులను సైనికులుగా ఉపయోగించుకుని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేలా చేశారని విమర్శించారు.
బ్రిటీష్ పాలనకు ముందు, తర్వాత దేశంలో సామాజిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటీష్ పాలకుల విధానాల కారణంగా కుల వ్యవస్థ మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలను పాలనా వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం ద్వారా వారికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలన ముగిసినా వారి ఆలోచనా విధానాల ప్రభావం ఇంకా కొనసాగుతోందని కవిత విమర్శించారు. ఇంగ్లీష్ మాట్లాడేవారినే గొప్పవారిగా, మాతృభాషలో మాట్లాడేవారిని తక్కువగా చూసే ధోరణి మారాల్సిన అవసరం ఉందన్నారు. ‘తెల్ల చర్మం గొప్పది, నల్ల చర్మం తక్కువ’ అనే భావజాలాన్ని బ్రిటీష్ పాలకులు ప్రోత్సహించి భారతీయుల మధ్య విభేదాలు సృష్టించారని కవిత ఆరోపించారు.
అలాంటి వలసవాద ఆలోచనా విధానాలను పూర్తిగా విడిచిపెట్టి.. స్వదేశీ చరిత్ర, భాష, సంస్కృతిపై గర్వాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సాధించినప్పటికీ వలస పాలనకు సంబంధించిన మానసిక ప్రభావాల నుంచి కూడా దేశం పూర్తిగా బయటపడాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు.
