
DNews:09 Mar: మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని ప్రణీత్ ఆంటీలియా గేటెడ్ కమ్యూనిటీలో హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కమ్యూనిటీకి చెందిన రక్షణ గోడను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు కూల్చివేయడంపై కాలనీ నివాసితులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము క్రమం తప్పకుండా మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్నామని, గ్రేటర్ కమ్యూనిటీగా గుర్తింపు ఉన్నప్పటికీ తమ భద్రతకు కీలకమైన గోడను తొలగించడం అన్యాయమని వారు ఆవేదన చెందుతున్నారు. కూల్చివేసిన గోడ స్థలం నుండి ఎగ్జిట్-4 వరకు రహదారిని ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం తమను మరింత ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. నివాసితులతో కనీసం చర్చించకుండా, చట్టపరమైన నోటీసులు ఇవ్వకుండా ఈ చర్యలు తీసుకోవడం సరైంది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. రక్షణ గోడ తొలగింపు వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతాయని, అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
