
DNews:05 Dec:తెలంగాణ రాష్ట్రం తీవ్ర చలి ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే పగటివేళల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండగా, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. తెల్లవారుజామున మంచు తీవ్రంగా కురుస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారు. ఈశాన్య దిశగా వీచే గాలులు మరింత చలిని తీసుకొస్తున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడడంతో శుక్రవారం, శనివారం రోజుల్లో ఎక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ నెల 9న మళ్లీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాలు, గాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరిగి రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
చలి తీవ్రత పెరుగుతాననే ముందస్తు హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. దీంతో ప్రజలు, పర్యాటకులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయాలని, గాలిలో తేమ తగ్గడం వల్ల చలి గాలులు విపరీతంగా వీచే అవకాశముందని హెచ్చరించారు.
ఇక రైతులు కూడా పంటపనులను వీలైనంత తొందరగా ముగించుకుని ఇంటికి చేరుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. మంచు, చలి కారణంగా పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, రాబోయే కొద్ది రోజులు తెలంగాణలో చలి కాటుకు ప్రజలు గజగజ వణికే పరిస్థితులు నెలకొననున్నాయి.
