
DNews: Dec 05: హైదరాబాద్లో హోటల్ దాసపల్లాలో గురువారం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 12వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ, వైద్యులు శస్త్రచికిత్సల ద్వారా వ్యాధులను నయం చేస్తే, తాము సమాజంలో ఉన్న ట్యూమర్లను తొలగించే పనిని చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణదారుల నుండి రక్షించడం తమ ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. గత 15 నెలల్లో హైదరా రూ.60,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులను రక్షించిందని, 2026 నాటికి రూ.1 లక్ష కోట్ల విలువైన ఆస్తులను కాపాడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను తిరిగి పొందడం ఒక సంతోషకరమైన అంశమని ఆయన పేర్కొన్నారు.
ఫౌండేషన్ స్థాపక అధ్యక్షుడు డాక్టర్ చినబాబు సుంకపల్లి మాట్లాడుతూ, 2026 ఫిబ్రవరి నుండి మేఘాలయలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. అనంతరం రంగనాథ్ ఫౌండేషన్ స్పాన్సర్లు, సహాయకులకు మేమెంటోలు అందజేశారు. వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి తదితరులు ప్రసంగించారు.
