
హైదరాబాద్లో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా గతంలో నిలిచిన జూబ్లీహిల్స్ ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. సుమారు నాలుగు లక్షలకు పైగా ఉన్న ఓటర్ల సంఖ్య ఎస్ఐఆర్ అనంతరం భారీగా తగ్గింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ఎస్ఐఆర్ తుది జాబితా ప్రకారం నియోజకవర్గంలో 1.79 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. మొత్తం ఓటర్లలో 44.19 శాతం మేర తగ్గడం గమనార్హం. అత్యధికంగా ఓట్లు తొలగించబడిన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ మూడో స్థానంలో నిలిచింది.
పేరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గమైనప్పటికీ ఇందులో బస్తీలే అధికం. మాస్ ఓటర్లే ఎన్నికల్లో కీలకంగా ఉంటారు. ప్రతి ఏడాది ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చిన ఈ నియోజకవర్గంలో కేవలం ఐదేళ్లలోనే దాదాపు 79 వేల మంది ఓటర్లు పెరిగారు. అయితే ఇక్కడ నివసించే వారిలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలస వచ్చిన వారు అధికంగా ఉండటంతో ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
‘ఒకరికి ఒకే ఓటు’ నిబంధన ప్రకారం అధికారులు జాబితాను సవరించారు. దీంతో పలువురు తమ స్వస్థలాల్లోనే ఓటు కొనసాగించేందుకు మొగ్గు చూపారు. షిఫ్టింగ్ జాబితా ప్రకారం ఏకంగా 1.48 లక్షల మంది తమ ఓటును జూబ్లీహిల్స్ నుంచి ఇతర ప్రాంతాలకు మార్చుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని అధిక శాతం బస్తీలకు చెందిన ఓట్లే ఇలా తరలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
హాస్టళ్లలో నివసించే వారూ ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. తాత్కాలికంగా స్థానిక చిరునామాలతో ఓటరు కార్డులు పొందిన వారిలో పలువురి ఓట్లు కూడా తాజా సవరణలో తొలగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,219కు చేరింది. వీరిలో పురుషులు 1,12,697 మంది, మహిళలు 1,14,513 మంది, ఇతరులు తొమ్మిది మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,816 మంది అధికంగా ఉన్నారు. ఎస్ఐఆర్కు ముందు పురుష ఓటర్లే ఎక్కువగా ఉండగా తాజా జాబితా తర్వాత పరిస్థితి మారింది.
నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్న రహ్మత్నగర్, షేక్పేట, బోరబండ డివిజన్లు ఎన్నికల్లో కీలకంగా ఉండేవి. అయితే ఎస్ఐఆర్ తర్వాత ఈ ప్రాంతాల నుంచే పెద్ద సంఖ్యలో ఓట్లు తరలిపోయినట్లు తెలుస్తోంది. యూసుఫ్గూడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో గత ఎన్నికల్లో కీలకంగా ఉన్న బస్తీ ఓటర్ల ప్రభావం ఈసారి ఎంతవరకు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
