
డప్పు చప్పుళ్లు.. పోతురాజుల నృత్యాలు.. అమ్మవారి నామస్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. హైదరాబాద్లో ఆదివారం బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాతబస్తీ లాల్దర్వాజా సింహవాహని మహంకాళి ఆలయంతో పాటు నగరవ్యాప్తంగా మహంకాళిఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
పలు ఆలయాల్లో కేటీఆర్ ప్రత్యేక పూజలు
లాలాదర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులందరూ సంతోషంగా ఉండాలని, హైదరాబాద్లో వ్యాపారాలు బాగా సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఆయన నగరంలోని పలు ఆలయాలను దర్శించి అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నాంపల్లిలోని ఏడుగుళ్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
అక్కడి నుంచి ఓల్డ్ సిటీలోని బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మీరాలం శ్రీమహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అటునుంచి అంబర్పేట నియోజకవర్గంలోని శ్రీమహంకాళి అమ్మవారి ఆలయం, లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కనకాల కట్ట మైసమ్మ దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను సందర్శించి.. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
