
భారతదేశం కేవలం ఆధునిక దేశం మాత్రమే కాదని వేల ఏళ్లుగా కొనసాగుతున్న సజీవ నాగరికత అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది సంవత్సరంలో పేర్కొంది. భవిష్యత్ భారత నిర్మాణానికి గతంలోని నాగరిక విలువలను అర్థం చేసుకోవడంతో పాటు సామాజిక ఐక్యత, సేవాభావం, నైతికత, స్వీయ క్రమశిక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది.
భారత నాగరికతలో శాంతియుత సహజీవనం, పరస్పర సామరస్యం, ఐక్యత వంటి విలువలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయని RSS అభిప్రాయపడింది. మాతృభూమితో ప్రజలకు ఉన్న అనుబంధం తోటి పౌరులను ఒకే కుటుంబ సభ్యులుగా భావించే దృక్పథం దేశ సమైక్యతకు బలమైన పునాదిగా నిలవాలని పేర్కొంది. ప్రతి పౌరుడు దేశం పట్ల తన బాధ్యతను గుర్తించి తన సమయం, ప్రతిభ, వనరులను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని పిలుపునిచ్చింది.
కేవలం రాజకీయ మార్పులు లేదా ఆర్థిక అభివృద్ధి మాత్రమే దేశ ప్రగతికి సరిపోవని RSS పేర్కొంది. సాంస్కృతిక చైతన్యం, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు కూడా జాతీయ అభివృద్ధిలో కీలకమని తెలిపింది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే బాధ్యతాయుతమైన పౌర సమాజం అవసరమని స్పష్టం చేసింది.
కులం, భాష, ప్రాంతం, మతం, లింగం, రాజకీయ అనుబంధం వంటి విభిన్న గుర్తింపులు సహజమైనవేనని అయితే అవి పరస్పర విభేదాలకు లేదా విభజనకు కారణం కాకూడదని RSS పేర్కొంది. దేశంలోని వివిధ భాషలను పోటీ శక్తులుగా కాకుండా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే సోదర భాషలుగా చూడాలని సూచించింది. రాష్ట్రాలు పరిపాలనా విభాగాలేనని ప్రాంతీయ గుర్తింపులు జాతీయ సమైక్యతను బలహీనపరిచే స్థాయికి చేరకూడదని తెలిపింది.
బౌద్ధం, జైనం, సిక్కు తదితర సంప్రదాయాలు కూడా భారతదేశ సుదీర్ఘ నాగరిక ప్రయాణంలో అంతర్భాగమని RSS పేర్కొంది. శతాబ్ది సంవత్సరంలో సామాజిక చైతన్యానికి ‘పంచ ప్రాణాలు’ను ప్రధానంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపింది. సామాజిక సమరసత పర్యావరణహిత జీవనశైలి కుటుంబ ప్రబోధం స్వయంవాలంబన–స్వదేశీ, పౌరుల ప్రాథమిక విధుల నిర్వహణ వంటి అంశాలను ప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించింది.
