
కాంగ్రెస్లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం పెరిగిందని మాత్రమే తాను వ్యాఖ్యానించానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం మరోసారి మీడియా ముందు ఆయన వివరణ ఇచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన రాజ్గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎక్కడా కాంగ్రెస్ నాయకులను విమర్శించలేదని, భవిష్యత్తులోనూ విమర్శించబోనని తెలిపారు.
నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారనే విషయాన్ని మాత్రమే తాను ప్రస్తావించానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనలో ఉద్యమకారులకు తగిన గుర్తింపు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర పాలకులు సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో నడవకూడదని రాజ్గోపాల్ రెడ్డి కోరారు.
ప్రజాపాలన అంటే పేదల సంక్షేమం కోసం పనిచేయడమేనని అన్నారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
