
D News: Aug 14: మహబూబాబాద్ ఇండియన్ బ్యాంకులో బంగారం మాయం.. అసిస్టెంట్ మేనేజర్పై ఆరోపణలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో బంగారం మాయం కావడం కలకలం రేపింది. బ్యాంకులో నిర్వహించిన ఆడిట్లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అదే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న రాజేష్ ఈ వ్యవహారానికి పాల్పడినట్లు గుర్తించినట్లు సమాచారం.
బ్యాంకులో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న 22 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 700 గ్రాముల బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ సుమారు రూ.90 లక్షలు ఉంటుందని బ్యాంకు అధికారులు, పోలీసులు అంచనా వేశారు.
విచారణలో భాగంగా.. మాయమైన బంగారు ఆభరణాలను అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ మరో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ రుణం ద్వారా పొందిన డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ప్రతి నెల బ్యాంకు మేనేజర్ పర్యవేక్షణలో నిర్వహించే తనిఖీల్లో భాగంగా బంగారం లెక్కలను పరిశీలించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బంగారం మాయం అయినట్లు గుర్తించిన బ్యాంకు మేనేజర్ మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పట్టణ సీఐ రఘుపతిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. మరోవైపు ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి బంగారానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు భరోసా ఇస్తున్నట్లు సమాచారం.
అయితే అసిస్టెంట్ మేనేజర్ ఈ వ్యవహారానికి తొలిసారిగానే పాల్పడ్డాడా? గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
