
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులను వేగవంతం చేసేందుకు హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రతిపాదిత కారిడార్లకు జనరల్ కన్సల్టెంట్లను త్వరితగతిన ఎంపిక చేసి ప్రాజెక్టు పనులకు అవసరమైన సన్నాహాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి 12 సంస్థలు హాజరయ్యాయి.
మెట్రో రెండో దశలో మొత్తం ఏడు కారిడార్లను ప్రతిపాదించారు. వీటి మొత్తం పొడవు 122.9 కిలోమీటర్లు కాగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,595 కోట్లుగా ఉంది. ఇందులో తొలి దశగా నాలుగు కీలక మార్గాలకు జనరల్ కన్సల్టెంట్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించింది.
ఈ నాలుగు కారిడార్లలో నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గం 36.8 కిలోమీటర్లు, రాయదుర్గ్ కోకాపేట మార్గం 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట మార్గం 7.5 కిలోమీటర్లు, ఎల్బీనగర్ హయత్నగర్ కారిడార్ 7.1 కిలోమీటర్ల మేర ఉండనుంది. జనరల్ కన్సల్టెంట్ల ఎంపికలో క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ (QCBS) విధానాన్ని అనుసరించనున్నారు.
సంస్థలకు మొత్తం 100 మార్కులతో మూల్యాంకనం చేపట్టనున్నారు. గతంలో నిర్వహించిన ప్రాజెక్టుల నాణ్యత నిర్మాణ సామగ్రి ప్రమాణాలు పనులు పూర్తి చేసిన సమయం వారంటీ తదితర అంశాలకు 70 మార్కులు కేటాయించారు. సంస్థల సీవీలు, నిపుణుల అర్హతలకు మరో 30 మార్కులు ఇవ్వనున్నారు.
టెండర్లలో సంస్థలు సమర్పించే పత్రాలను పరిశీలించడంతో పాటు గతంలో వారు చేపట్టిన ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది. నాణ్యత సాంకేతిక సామర్థ్యం టెండర్ ధర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేపట్టనున్నారు.
మరోవైపు మెట్రో రెండో దశ డీపీఆర్కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కేంద్రం నుంచి అనుమతులు లభించిన వెంటనే ప్రాజెక్టు పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను హెచ్ఎంఆర్ఎల్ సిద్ధం చేస్తోంది.
ఇదే సమయంలో ఎల్అండ్టీ నుంచి తొలి దశ మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన రుణాల సమీకరణపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ఎస్బీఐ క్యాప్స్ను కన్సల్టెన్సీ సంస్థగా నియమించింది. దేశ విదేశాల్లోని బ్యాంకులతో చర్చలు జరిపి రుణాలను సమీకరించే బాధ్యతను సంస్థకు అప్పగించింది.
