
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి వన్వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఫ్లైఓవర్లు, బహుళ అంతస్తుల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఈ తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నారు.
ట్రాఫిక్ ప్రవాహంపై అధ్యయనం, రెండు విడతల ట్రయల్ రన్, స్థానిక ప్రజలు, వాకర్స్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో సంప్రదింపులు, జీహెచ్ఎంసీతో సమన్వయం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ కేబీఆర్ పార్క్ వద్ద వన్వే విధానంపై ట్రయల్ రన్ నిర్వహించి ట్రాఫిక్ సరళిని పరిశీలించారు.
నిర్మాణ పనుల సమయంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేలా కీలక కూడళ్ల వద్ద అదనపు సిబ్బందిని మోహరించనున్నారు. వాహనదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు ట్రాఫిక్ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, అవసరమైన చోట ఆంక్షల్లో మార్పులు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
బహుళ అంతస్తుల నిర్మాణాలు, కొత్త ఫ్లైఓవర్ల పనులు పూర్తయిన తర్వాత కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, రోడ్ నంబర్ 45, ఫిల్మ్నగర్, మహారాజా అగర్సేన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి సిగ్నల్-ఫ్రీ ప్రయాణానికి మార్గం సుగమం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ మార్పులతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే కొత్త ఫ్లైఓవర్ల ద్వారా ఐటీ కారిడార్కు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వాహన కాలుష్యం కూడా తగ్గే అవకాశముంది.
నిర్మాణ పనుల సమయంలో తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఎదురైనా, పనులు పూర్తయిన తర్వాత నగర ట్రాఫిక్ సమస్యలు మరింత తగ్గుతాయని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా హెచ్ఎండీఏ చర్యలు చేపడుతోంది. కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చే నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిగణనలోకి తీసుకుని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
