
తెలంగాణ కాంగ్రెస్లో తాజా రాజకీయ పరిణామాలు ఢిల్లీ వేదికగా ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏఐసీసీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇతర కీలక అంశాలపై రాహుల్తో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయంపై రేవంత్ రెడ్డి–రాహుల్ గాంధీ భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం పార్టీ అగ్రనేతలతో వరుసగా సమావేశమయ్యారు. కొండా సురేఖ అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
బుధవారం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదికతో పాటు కమిటీ సూచనలను అధిష్ఠానానికి అందజేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గురువారం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ జరిగితే కొండా సురేఖపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో రేవంత్–రాహుల్ భేటీపై తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు ఢిల్లీలో తన కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు సమాచారం.
