Dnews 08: హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక టాగోర్ ఆడిటోరియంలో ఉస్మానియా యూనివర్సిటీ (OU) 85వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గవర్నర్, ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించి పట్టభద్రులైన పరిశోధకులు, గోల్డ్ మెడలిస్టులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు.
109 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిన ఈ స్నాతకోత్సవంలో 12 విద్యా విభాగాలకు చెందిన 640 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు. అలాగే విద్యా ప్రతిభ కనబరిచిన 71 మంది ఉత్తమ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు.
భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం. ఎల్లా ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. యువ పరిశోధకులు నూతన ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతికత అభివృద్ధి, సమాజంపై సానుకూల ప్రభావం చూపే పరిశోధనలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం యూనివర్సిటీ నివేదికను సమర్పించారు. అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీ సాధిస్తున్న గుర్తింపు, పరిశోధన రంగంలో పురోగతి, క్యాంపస్ అభివృద్ధికి చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆయన వివరించారు.
