
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలను ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే దానం నాగేందర్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు 30 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు దానం నాగేందర్ వెల్లడించారు. భారీగా భక్తులు వచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున అవసరమైన నిధులను కేటాయిస్తామని తెలిపారు.
సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం ఖైరతాబాద్ గణేశ్ ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దానం నాగేందర్ వెల్లడించారు. విగ్రహ తయారీ కొంత ఆలస్యమైన విషయం వాస్తవమేనని పేర్కొంటూ చవితికి రెండు రోజుల ముందుగానే భక్తులకు గణేశుడి దర్శనం కల్పించేలా పనులను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
విగ్రహ తయారీతో పాటు మండపం, పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తుల రాకపోకలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఉత్సవ కమిటీతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు.
