
మణికొండలో రోజురోజుకూ తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మణికొండ ప్రజా ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ప్రజా వాకథాన్ నిర్వహించారు. మర్రిచెట్టు నుంచి ఓయూ కాలనీ ప్రధాన రహదారి మీదుగా శివాలయం, హనుమాన్నగర్, శ్రీనివాస కాలనీ, పంచవటి కమాన్, ట్రైల్స్, భాగ్యలక్ష్మి కాలనీ రోడ్డు, కనకదుర్గమ్మ ఆలయం మీదుగా ఆదిత్య అథీనా వరకు వాకథాన్ కొనసాగింది.
మర్రిచెట్టు, శివాలయం, హనుమాన్నగర్, శ్రీనివాస కాలనీ, పంచవటి కమాన్, ట్రైల్స్ ప్రాంతాల్లో తరచూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 80 అడుగుల రహదారి విస్తరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించడంతో పాటు ప్రధాన రహదారిపై అక్రమ పార్కింగ్ను నియంత్రించాలని కోరారు.
పంచవటి కాలనీ రోడ్ నంబర్ 10 వద్ద నిర్మించిన బాక్స్ డ్రెయిన్-కమ్-రోడ్డును కూడా వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ సమస్యను తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్య పరిష్కారం కోసమే ఈ వాకథాన్ నిర్వహిస్తున్నామని, దీనికి ఎలాంటి రాజకీయ సంబంధం లేదని మణికొండ ప్రజా ఐక్య వేదిక ప్రతినిధులు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పాల్గొని అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు.
