
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించడం కేంద్రం నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం సాధించాలంటే దేశంలోని ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ఆర్థిక సహాయం, కేంద్ర నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు గళమెత్తడం లేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నప్పుడు తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కూడా సహకరించాలని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
