
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో కీలకమైన పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో విస్తరణతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్ల కొనుగోలు, భూసేకరణ, టెండర్ ప్రక్రియలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం (ఆగస్టు 11) హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మెట్రో రెండో దశ పనుల పురోగతి, పాతబస్తీ కారిడార్, భూసేకరణ, టెండర్లతో పాటు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కోచ్ల సంఖ్య పెంపుపై అధికారులతో చర్చించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుంచి అవసరమైన సాంకేతిక సలహాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో అధునాతన టెక్నాలజీని అమలు చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాతబస్తీకి మెట్రో రైలు అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. అంతేకాకుండా నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో పాతబస్తీ మెట్రో కారిడార్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లకు అదనపు బోగీలు జత చేయాలని, ఇందుకోసం అవసరమైన కొత్త మెట్రో కోచ్ల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పీక్ అవర్స్లో రద్దీని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు.
