
D-News: బెంగళూరులో Zepto గోదాం, ముంబైలో Blinkit కేంద్రం ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. కర్ణాటకలోని హోస్కోటేలో Zepto గోదాంలో అపరిశుభ్ర ఆహార నిల్వ, సరైన లేబులింగ్ లేకపోవడం, తప్పుదారి పట్టించే బ్రాండింగ్, ఆహార నిర్వహణలో లోపాలను అధికారులు గుర్తించారు. దీంతో గోదాంను సీజ్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలకు సిఫారసు చేశారు.
బెంగళూరులోని గొట్టిగెరె, సింగసంద్ర, లింగరాజపురం ఇందిరా క్యాంటీన్లలోనూ తనిఖీలు జరిగాయి. లేబులింగ్, ఆహార నాణ్యత తదితర నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడంతో గొట్టిగెరె క్యాంటీన్ను సీజ్ చేశారు. పప్పులు, పసుపు, నూనె, బెల్లం, ఉప్పు, చక్కెర, వండిన ఆహార నమూనాలను పరీక్షలకు పంపారు.
Zepto అధికారులు చేసిన తనిఖీలకు పూర్తిగా సహకరించామని, గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
ఇక ముంబైలోని మలాడ్ (వెస్ట్) Blinkit కేంద్రంలో పెద్ద ఎత్తున బొద్దింకల సమస్య, తుప్పుపట్టిన ర్యాక్లపై ఆహార నిల్వ, అపరిశుభ్రమైన కోల్డ్ స్టోరేజ్, గడువు ముగిసిన లేదా దెబ్బతిన్న ప్యాకేజీలు గుర్తించారు. దీంతో ఆ కేంద్రం ఆహార వ్యాపార లైసెన్స్ను మహారాష్ట్ర అధికారులు సస్పెండ్ చేశారు.
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో Reliance Retail దుకాణంలో విక్రయిస్తున్న ‘కాజు కట్లీ’లో పురుగుల లార్వా ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అందుబాటులో ఉన్న మరో బ్యాచ్ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. 54 బాక్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆహార సంస్థలు పరిశుభ్రత, సరైన నిల్వ, పురుగుల నియంత్రణ, గడువు ముగిసిన ఆహారాన్ని సురక్షితంగా తొలగించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు.
