
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ హైకోర్టు సూచనలు చేసినప్పటికీ రంగనాథ్ వైఖరిలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు.
నాదర్గుల్లో పెద్దఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ వాటిని హైడ్రా ఎందుకు పరిరక్షించడం లేదని రాంచందర్ రావు ప్రశ్నించారు. అక్కడ అనేక ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రంగనాథ్కు మజ్లిస్పై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని విమర్శించారు.
వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని హైడ్రా చెబుతోందని, అయితే ఆ భూములు ఎక్కడ ఉన్నాయో ఎందుకు ప్రజల ముందుకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కాపాడిన భూముల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణయాగం చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోవాలని తాము వాయు యాగం చేస్తామని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. వానాకాలం దాదాపు ముగిసిన తర్వాత వరుణయాగం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు.
