
D Spiritual: Jan 28: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో తొలిగా గద్దెలకు వచ్చేది సారలమ్మనే అన్న భావన చాలామందిలో ఉంది. అయితే గిరిజన సంప్రదాయాల ప్రకారం ముందుగా గద్దెలపై అడుగుపెట్టే దేవత లక్ష్మీదేవర. ఈ విషయం ఆదివాసీ సంస్కృతిని దగ్గరగా తెలిసినవారికే బాగా తెలుసు. సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రారంభ సమయంలో జంపన్న వాగు వద్ద డప్పులు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తూ లక్ష్మీదేవర దర్శనం ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ దృశ్యం గిరిజన ఆచారాలకు అద్దం పడుతుంది.
లక్ష్మీదేవర నాయక్పోడ్ గిరిజన తెగకు ప్రధాన ఆరాధ్య దైవం. ఆదివాసీ కథనాల ప్రకారం సమ్మక్కకు ఒక ఆడపడుచు ఉండగా ఆమెనే లక్ష్మీదేవరగా విశ్వసిస్తారు. అందుకే మేడారం జాతరలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బూరుగుపేట–నగరంపల్లి ప్రాంతంలో నేటికీ లక్ష్మీదేవర వెదురు చెట్టు రూపంలో దర్శనమిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అక్కడ ఆమెకు సంబంధించిన పురాతన ఆలయం కూడా ఉంది.
లక్ష్మీదేవర గుర్రం రూపంలో దర్శనమిస్తే, పోతరాజు మరియు కిష్టస్వామి చెక్కబొమ్మల రూపంలో పూజలు అందుకుంటారు. ఈ సంప్రదాయాలు నాయక్పోడ్ గిరిజనుల విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి.
మేడారం జాతర సమయంలో పగిడిద్దరాజు సోదరిగా భావించే లక్ష్మీదేవర అమ్మవారిని నాయక్పోడ్ గిరిజనులు గద్దెల వద్దకు తీసుకువస్తారు. బూరుగుపేట నుంచి కాల్వపల్లి, దూదేకులపల్లి మీదుగా అటవీ మార్గాల్లో సుమారు 55 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తారు. మేళతాళాలు, డప్పుల శబ్దాలు, సంప్రదాయ నృత్యాల నడుమ అమ్మవారిని పగిడిద్దరాజు వద్దకు చేర్చడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ ఊరేగింపులో సంతానం లేని దంపతులు పాల్గొని లక్ష్మీదేవర ఆశీర్వాదం పొందడం కూడా ఒక ప్రత్యేక సంప్రదాయం. నాయక్పోడ్ తెగకు చెందిన రెడ్డి, తగిన, మేకల వంశీయులు అమ్మవారిని మేడారం గద్దెలకు అందరికన్నా ముందుగా చేర్చడం గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది.
మేడారం జాతరలో లక్ష్మీదేవర పాత్రను తెలుసుకుంటే, ఈ మహాజాతరలోని అసలైన ఆదివాసీ ఆత్మను అర్థం చేసుకున్నట్టే.
