
D Spiritual: Dec 11: ఆలయాలకు వెళ్లినప్పుడు దేవుడి దర్శనం అనంతరం భక్తులు మహాప్రసాదం కోసం వేచిచూస్తారు. ప్రసాదంతో పాటు పురోహితులు మంత్రోచ్ఛారణలతో చేతిలో పోసే తీర్థాన్ని అమృతంతో సమానంగా భావిస్తారు. ఈ తీర్థంలో పంచామృతాలు, తులసీ దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తి వంటివి కలిసే ఉండటంతో అది అత్యంత పవిత్రంగా, ఆధ్యాత్మికంగా మారుతుంది. తీర్థం తీసుకున్నప్పుడు భక్తులలో ఒక ప్రత్యేకమైన శక్తి, శాంతి అనుభూతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
పురోహితులు సాధారణంగా తీర్థాన్ని మూడు సార్లు ఇస్తారు. తీర్థం అనే పదానికి ‘తరించజేసేది’ అనే అర్థం ఉంది. పురాణాల ప్రకారం మూడు సార్లు తీర్థం తీసుకుంటే భోజనం చేసినంత శక్తి లభిస్తుంది. మొదటి సారి తీసుకున్నప్పుడు శారీరక–మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారికి ధర్మ, న్యాయబుద్ధి పెరుగుతాయి. మూడోసారి తీసుకునేటప్పుడు దానిని పరమేశ్వరుని పరమపదంగా భావించి సేవించాలి. ఇలా తీర్థాన్ని సేవించడంవల్ల కనిపించే, కనిపించని రోగాలు తొలగుతాయని ప్రతీతి.
తీర్థం తీసుకునే విధానంలో కూడా ఒక ప్రత్యేక శాస్త్రం ఉంది. కుడిచేయి కింద ఎడమచేయి ఉంచి, కుడిచేయి చూపుడు వేలు మధ్యగా బొటనవేళ్లను మడిచి గోముఖ ముద్రలో తీర్థాన్ని స్వీకరించాలి. జల తీర్థం, కషాయ తీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం వంటి అనేక రకాల తీర్థాలు పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. జల తీర్థం అకాల మరణం, రోగాలు నివారించడంలో సహాయకమై, ధర్మంలో నిలబడే శక్తిని ఇస్తుంది. కషాయ తీర్థం కొల్లాపుర మహాలక్ష్మి, కొల్లూరు మూకాంబిక, జ్వాలామాలిని, కామాఖ్య ఆలయాల్లో ఇవ్వబడుతుంది. పంచామృత తీర్థం జీవితం లోని పనులను విజయవంతం చేస్తుందని నమ్మకం ఉంది.
అలాగే మంగళగిరి నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామికి పానకం నైవేద్యంగా పెట్టే సంప్రదాయంతో ‘పానకాల స్వామి’గా ప్రసిద్ధి వచ్చాయి. ఈ పానక తీర్థాన్ని సేవించడం ద్వారా దేహంలో ఉత్సాహం పెరగడం, శరీరంలో వేడి సమతుల్యం అవడం, రక్తపోటు నియంత్రణ, తలనిర్బంధం తగ్గడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఎముకల సంబంధిత వ్యాధులకు కూడా ఇది ఉపశమనాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు.
చాలామంది తీర్థాన్ని తీసుకున్న తర్వాత తలకు రాస్తారు, కానీ ఇది పురాణాల ప్రకారం తప్పు. తలపై బ్రహ్మ దేవుని స్థానం ఉన్నందున, తలపై తీర్థాన్ని రాయడం బ్రహ్మకు ఎంగిలి అర్పించినట్లుగా అవుతుంది. అదేవిధంగా పంచామృతంలో పాలు, పెరుగు, తేనే ఉండటం వల్ల జుట్టుకు హానికరమయ్యే అవకాశం ఉంది. గంగాజలంతో చేసిన తీర్థాన్ని మాత్రమే తలకు రాయవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో తీర్థం తీసుకునేప్పుడు కూర్చుని, ఆలయంలో తీసుకునేప్పుడు నిలబడి తీసుకోవడం శాస్త్రోక్తం.
