
DNews:26 Nov:కరీంనగర్లో వన్యప్రాణి సంచారం మరోసారి కలకలం రేపింది. కరీంనగర్ నగరంలోని వావిలాల పల్లిలోని ఒక ఆఫీస్ ప్రాంగణంలోకి నక్క అకస్మాత్తుగా ప్రవేశించింది. మధ్యాహ్నం సమయంలో నక్క కనిపించగా, ఆఫీస్ ఉద్యోగి మారం జలంధర్ రెడ్డి దీనిని గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “నక్క తోక తొక్కితే అదృష్టం” అనే నమ్మకం నేపథ్యంలో, నక్క తమ ఆఫీసుకు రావడం తమకు శుభప్రదమని ఉద్యోగులు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు స్పందించగా, అయితే నక్క ఉదయం సమయంలో గేటు ద్వారా బయటకు వెళ్లిపోయింది. అటవీ విభాగం పేర్కొన్నదేమిటంటే—అటవీ ప్రాంతాలు తగ్గిపోవడం, నీరు-ఆహారం దొరకకపోవడం వల్లే వన్యజీవులు పట్టణ ప్రాంతాలకు వస్తున్నాయని.
కరీంనగర్ జిల్లాలో వన్యప్రాణుల ప్రవేశం ఇది మొదటిసారి కాదు.అక్టోబర్ 2025లో సైదాపూర్ మండల కేంద్రంలో ఎలుగుబంటి సంచారం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.జులై 2025లో కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలో ఎలుగుబంటి రాత్రివేళ నివాస ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల్లో భయాందోళన కలిగించింది.అటవీ శాతం అత్యల్పంగా ఉన్న జిల్లాగా కరీంనగర్ ఉన్నటువంటి నేపథ్యంలో, వన్యజీవుల సంచారం పెరుగుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
