
DNews:26 Nov:వరంగల్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంగెం మండలంలోని టెక్స్టైల్ పార్క్ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిని “అవినీతి అనకొండ” అని సంభోధించారు. రేవంత్ అన్నదమ్ములు ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ సంపాదిస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ కాంగ్రెస్ను “ఏటీఎం”లా మార్చేశారని విమర్శలు గుప్పించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకం ఆడిందని, బీసీలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ విజన్కి ప్రతీకగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిలుస్తోందని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టుతో కైటెక్స్, యంగ్ వన్, గణేశా వంటి సంస్థలు 30 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. అయితే గత రెండేళ్లుగా అభివృద్ధి మందగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ—
- కేఎమ్టీపీ (Kakatiya Mega Textile Park) ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన గొప్ప బహుమతిగా నిలిచిందని, దీనినే ఆదర్శంగా తీసుకుని కేంద్రం “పీఎం మిత్ర”ను ప్రవేశపెట్టిందని అన్నారు.
- “తెలంగాణ పాటిస్తుంది… దేశం అనుసరిస్తోంది” అని ప్రకటించారు.
- హైదరాబాద్లో 27 మున్సిపాలిటీలను ఏ ప్రయోజనాల కోసం కలిపారో రేవంత్ వివరించాలని డిమాండ్ చేశారు.
రైతుల వద్ద తక్కువ ధరకు భూములు తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి “ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్”ను తెచ్చారని, దీనిలో ₹5 లక్షల కోట్ల కుంభకోణం ఉన్నట్లు ఆరోపించారు. ఈ స్కీమ్ రేవంత్ రెడ్డి సోదరుల ప్రయోజనాల కోసం రూపొందించబడి ఉందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా అవసరాల కోసం ఆ భూములను ఉపయోగించాలని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి “తెలంగాణ మోడల్ — రాహుల్ మోడల్” అంటూ భజనలు తప్ప మరేదీ చేయడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
