
DNews:24 Nov:జగిత్యాల, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం నేడు మాజీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు నూతన కార్యవర్గాన్ని శాలువాతో సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేవలం విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు మాత్రమే కాక, విశ్రాంత ఉద్యోగస్తులు కూడా ప్రధాన పాత్ర పోషించారు అని కొనియాడారు. సకల జనుల సమ్మెలో యావత్ తెలంగాణ సమాజం రాజకీయాలకతీతంగా ఉద్యమించిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆశయాలు, ఆకాంక్షలు, హక్కులు సాధించుకునేందుకు అవసరమని ప్రజలు కోరుకున్నారని తెలిపారు. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని తెలిసినా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడాన్ని ప్రధాన బాధ్యతగా భావించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆమెకే దక్కుతుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్కు ఉద్యమ నాయకుడిగా అవకాశం వచ్చిందని గుర్తు చేశారు.
