
DNews:24 Nov:నిజామాబాద్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో, నిజామాబాద్ జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల హాస్టల్లో పదో తరగతి చదువుతున్న షేక్ మూస అనే విద్యార్థి బలవన్మరణం చెందాడు.
వివరాల ప్రకారం, శుక్రవారం ఆధార్ అప్డేట్ కోసం నిజామాబాద్లోని ఇంటికి వెళ్లిన మూస, ఆదివారం సాయంత్రం హాస్టల్కు తిరిగి వచ్చాడు. ఆ రోజు రాత్రి విద్యార్థులంతా పడుకున్నాక, మూస హాస్టల్లోని రేకుల షెడ్డు రాడ్కు తువాలుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు తెలిపారు.
