
DNews:15 NOV:తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం 2030 నాటికి రాష్ట్రాన్ని దేశంలోని ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా రూపుదిద్దడం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీ లో కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, ఐఎస్బీ, ముంజాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన, ఈ రంగాలలో జరుగుతున్న ప్రపంచ మార్పులను తెలంగాణ అవకాశాలుగా మార్చుకుంటోందని వివరించారు. గ్లోబల్ సప్లై చెయిన్ ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో నమ్మకమైన తయారీ కేంద్రాల కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, ఇది తెలంగాణకు పెద్ద అవకాశమని తెలిపారు. దేశవ్యాప్తంగా గతేడాది రక్షణ ఉత్పత్తులు రూ.1.5 లక్షల కోట్లను దాటడం, రక్షణ ఎగుమతులు 12% పెరగడం దేశ శక్తిని సూచిస్తున్నాయని ఆయన అన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఏరోస్పేస్, రక్షణ రంగం కీలకంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 25కి పైగా అంతర్జాతీయ, జాతీయ కంపెనీలు, 1,500కి పైగా ఎంఎస్ఎంఈలు పనిచేస్తూ ‘తెలంగాణ బ్రాండ్’ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయని చెప్పారు. 2023–24లో రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతులు రూ.15,900 కోట్లు ఉండగా, 2024–25లో తొలి తొమ్మిది నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరగడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనం అని ఆయన వెల్లడించారు. ఇటీవల ఆదిభట్లలో టాటా–సాఫ్రాన్ రూ.425 కోట్ల యంత్రాంగం ప్రారంభమైందని, త్వరలో జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ రూ.800 కోట్లతో యూఏవీ తయారీ కేంద్రం, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ రూ.500 కోట్లతో డిఫెన్స్ ఫెసిలిటీ ప్రారంభంకానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పలువురు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి వెల్లడించారు.
