
DNews:15 NOV:గోషామహల్ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు రాజాసింగ్ మరోసారి సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “బీజేపీ నేతలు మొండితనంతో ముందుకు పోతున్నారు. ఎవరి మాట వినడం లేదు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడంలేదు” అని పేర్కొన్నారు.అలాగే, “ఏ విధంగా గెలవాలి, ఓటరును ఏ విధంగా మన వైపు మళ్లించుకోవాలనే విషయాలను నేర్చుకోండి. ఏదైనా విషయం చెబితే ఆలోచించండి” అని నాయకత్వానికి సూచించారు.
చివరిగా, “తెలంగాణలో బీజేపీ చనిపోతుంది, కిషన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి” అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ. కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ వేడుకున్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
