
DNews:22 Nov:మక్తల్, నారాయణపేట జిల్లాలో రహదారుల దయనీయ పరిస్థితిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గంలోనే రహదారులు గుంతలతో నిండిపోవడంతో ప్రయాణికులు రోజూ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. మక్తల్ నుంచి నారాయణపేటకు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకల కారణంగా పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు పెరుగుతున్నాయి.
వాహనాలు తరచూ గుంతల్లో ఇరుక్కుపోవడం, చిన్నా–పెద్దా ప్రమాదాలు చోటుచేసుకోవడం సాధారణమైపోయింది. ఏ క్షణమైనా ప్రాణాంతక ప్రమాదం సంభవించే పరిస్థితి నెలకొనిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఎంత తీవ్రమైనదైనా, సంబంధిత శాఖ అధికారులు రహదారి మరమ్మతులపై దృష్టి సారించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రంలోని దవాఖానలకు వెళ్లడమే ఒక పెద్ద సవాలై మారింది. అంబులెన్స్ రాకపోకలు కూడా ఇబ్బందిగా మారడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి ప్రతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని రహదారిని అత్యవసరంగా అభివృద్ధి చేయాలని మక్తల్ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
