
DNews:22 Nov:మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ నిర్లక్ష్యం మరోసారి చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలమైన ఈ జిల్లాలోనే సకాలంలో చికిత్స అందక ఓ గురుకుల విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది.వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన 11 ఏళ్ల చేగువీర మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ గురుకులంలో చదువుతున్నాడు. ఈ నెల 12న ఇంటికి వచ్చాక అనారోగ్యం తీవ్రంగా మారడంతో తల్లిదండ్రులు వనపర్తి జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు డెంగీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించారు.
అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్స్రే చేయగా చిన్నారి ఊపిరితిత్తుల్లో న్యూమోనియా తీవ్రమైందని బయటపడింది. దీనిని తొలి దశలో గుర్తించడంలో ఆలస్యం కావడంతో పరిస్థితి మరింత విషమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సమయం వృథా కాకుండా నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేయాల్సిన బదులు, బాలుడిని మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కూడా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతూ చివరకు హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి పంపారు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది.
నిలోఫర్ వైద్యులు “చిన్నారిని ముందుగానే తీసుకెచ్చి ఉంటే ప్రాణాలు కాపాడగలిగేవాళ్లం” అని కుటుంబ సభ్యులకు తెలిపారు. చివరకు శనివారం తెల్లవారుజామున చేగువీర ప్రాణాలు కోల్పోయాడు.“మా బిడ్డను మూడు ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఎక్కడా సరైన చికిత్స అందలేదు… మా కొడుకును కాపాడుకోలేకపోయాం” అని నిరుపేద తల్లిదండ్రులు కన్నీటితో చెప్పారు.
ఈ ఘటనపై స్థానిక ప్రజలు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
