
DNews:21 NOV:ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయాబీన్ కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. హైదరాబాద్–నాగపూర్ జాతీయ రహదారి 44పై చేపట్టిన ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోళ్ల పేరుతో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వారు ఆరోపించారు. ముఖ్యంగా సీసీఐ తేమ శాతం పేరిట పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు క్వింటాలుకు రూ.1500 వరకు నష్టపోతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లకే సీసీఐ కొనుగోలు పరిమితం చేయడంతో మిగిలిన పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుందని తెలిపారు.
సోయాబీన్ కొనుగోలులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, వేలిముద్ర తప్పనిసరి చేశారని, వర్షాల కారణంగా దెబ్బతిన్న సోయాబీన్ను మార్క్ఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు దళారుల వద్దకు వెళ్లి నష్టపోతున్నారని వారు వాపోయారు.పంటల కొనుగోళ్లలో ఉన్న నిబంధనలు ఎత్తివేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. రైతుల ఈ నిరసన కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.
