
DNews: Nov 21: హైదరాబాద్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సీఐడీ ఎస్ఐటీ అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ నేపథ్యంలో ఈ యాప్లను ప్రమోట్ చేసిన పలువురు సినీ ప్రముఖులను విచారణకు పిలుస్తున్నారు. శుక్రవారం నటి నిధి అగర్వాల్, అమృతా చౌధరి, యాంకర్ శ్రీముఖి విచారణకు హాజరయ్యారు. నిధి అగర్వాల్ “జీత్ విన్” అనే బెట్టింగ్ సైట్ను ప్రమోట్ చేసినట్లు, శ్రీముఖి “M88” యాప్ను ప్రచారం చేసినట్లు, అమృతా చౌధరి “యోలో 247” మరియు “ఫెయిర్ప్లే” యాప్లను ప్రమోట్ చేసినట్లు సమాచారం. విచారణలో అధికారులు వీరిని అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బెట్టింగ్కు పాల్పడటానికి గల కారణాలను సీఐడీ ఎస్ఐటీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృతా చౌధరి తమ బ్యాంక్ స్టేట్మెంట్లు, అలాగే బెట్టింగ్ యాప్ యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలను అధికారులకు సమర్పించారు. గతంలో మియాపూర్, పంజాగుట్ట పోలీస్స్టేషన్లలో సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 29 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంతి వంటి ప్రముఖులను అధికారులు విచారించారు.
