
DNews:23 Jan: నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో మద్యం విక్రయాల కోసం ఎమ్మెల్యే సొంతంగా విధించిన సమయపాలన నిబంధనలను బేఖాతరు చేస్తూ, అధికారులు దగ్గరుండి వైన్ షాపులను తెరిపించారు. సంస్థాన్ నారాయణపూర్లో ఎమ్మెల్యే అనుచరులు కొందరు మద్యం దుకాణాల వద్దకు వెళ్లి, రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం వరకు షాపులు తెరవకూడదని హుకుం జారీ చేసి బలవంతంగా మూసివేయించారు. ఈ చర్యలపై వైన్ షాపుల నిర్వాహకులు పోలీసులకు మరియు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై వెంటనే స్పందించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ పాలసీనే మునుగోడులోనూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పోలీసుల భారీ పహారా మధ్య అధికారులు స్వయంగా మూసివేసిన షాపులను తెరిపించి, ఉదయం నుంచే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి వ్యాపారాలను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం మరియు మహిళల సంక్షేమం దృష్ట్యా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే వైన్ షాపులు తెరవాలని ఎమ్మెల్యే పట్టుబడుతుండగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించడం ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
