
DNews:13 NOV:మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూరు మండలం, రామచంద్రు తండాలో ఓ రైతుకు పెను విషాదం ఎదురైంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినడం, ఆపై మిగిలిన పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో విలవిలలాడుతున్న రైతుకు అగ్నిప్రమాదం రూపంలో మరింత నష్టం జరిగింది.
రామచంద్రు తండాకు చెందిన రైతు బాదావత్ శంకర్, తన పొలంలో పండిన పత్తిని విక్రయించక, తన ఇంటి ముందు ఆరబెట్టాడు. అయితే, బుధవారం ఉదయం 11:11 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆరబెట్టిన పత్తికి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రమై పత్తి అంతా కాలి బూడిదైంది. పత్తికి కాపలాగా ఉన్న మహిళ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఈ అగ్నిప్రమాద దృశ్యాలు రైతు ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో తనకు రూ. 3 లక్షల విలువైన పంట నష్టం జరిగిందని రైతు శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అకాల వర్షాలతో నష్టపోగా, మిగిలిన పంట కూడా కాలిపోవడంతో ప్రభుత్వం స్పందించి, తక్షణమే ఆర్థిక సహాయం అందించి తనను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశాడు.
