
DNews:18 NOV:కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్, మావోయిస్టుల ఎన్కౌంటర్లు మరియు వారి కార్యకలాపాలపై తీవ్రంగా స్పందించారు. అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో, తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏమీ సాధించలేరని ఆయన స్పష్టం చేశారు.పోలీసుల చేతుల్లోనే తుపాకులు ఉండాలి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఏరియా ఆసుపత్రిలో వైద్య పరికరాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. “తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతుల్లో… మావోయిస్టుల చేతుల్లో కాదు” అని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టుల చేతుల్లో తుపాకులు ఉన్నంతవరకు చర్చలకు అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. బుల్లెట్ను నమ్ముకుని మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతుంటే, తాము బ్యాలెట్ను నమ్ముకుని అధికారంలోకి వచ్చామని ఆయన పేర్కొన్నారు.
బండి సంజయ్ ఈ సందర్భంగా అర్బన్ నక్సల్స్పై విమర్శలు గుప్పించారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సాలు చేస్తుంటే, అమాయక ఆదివాసీలు, గిరిజనులు అడవుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్లో ఆదివాసీలు, గిరిజనుల మరణాలకు అర్బన్ నక్సల్స్ కారణమని ఆయన విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్న అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దని పేదలకు సూచించారు. వారి మాటలు నమ్మి తుపాకీ పట్టిన అమాయక పేదలే అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మావోయిస్టులు పంతాలు వీడి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్ర మంత్రి సూచించారు. “చిన్న పిల్లలకు తుపాకులు ఇచ్చి మావోయిస్టులు ఏం సాధిస్తారు?” అని ప్రశ్నించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది మావోయిస్టులు లొంగిపోయారని, కానీ కొంతమంది ఇంకా పంతాలకు పోతున్నారని తెలిపారు. పంతాలకు పోయి ప్రాణాలు తీసుకోవద్దని హితవు పలికారు.మావోయిస్టులను అంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. మార్చి 2026 లోపు మావోయిస్టులందరూ లొంగిపోవాలని కోరారు. మావోయిస్టులు జనంలో కలిసేందుకు ఇంకా నాలుగు నెలల గడువు మాత్రమే ఉందని, వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని ఆయన గట్టిగా ప్రకటించారు.
