
DNews:14 NOV:మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల బెల్లంపల్లి రేంజ్ పరిధిలోని బుగ్గగూడెం శివారులో, అలాగే దేవాపూర్ రేంజ్లోని ఎగ్గండి ప్రాంతంలో రెండుచోట్ల పులి పశువులపై దాడులు చేసింది. ఈ రెండు ఘటనల్లో పశువులు మృతి చెందడం గ్రామస్తుల్లో ఆందోళనకు దారితీసింది.
బుగ్గగూడెం గ్రామానికి సమీపమైన రాళ్లవాగు పక్కనున్న పత్తి చేనులో పల్లె ఎల్లక్కకి చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అదే సమయంలో దేవాపూర్ రేంజ్లోని ఎగ్గండి ప్రాంతంలో కూడా మరో ఆవును పులి చంపేసింది.
ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో పెద్దపులి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాలకు సమీపంలోని అడవి శివారుల్లో నివసించే ప్రజలు, పశువుల కాపర్లు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. పులి సంచారం కొనసాగుతున్నందున జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
అడవి ప్రాంతాల చుట్టుపక్కల కదలికలు తగ్గించాలని, పశువులను అడవికి చాలా సమీపంలో మేపించవద్దని అధికారులు సూచిస్తున్నారు. పులిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
