
DNews:23 Dec: అవినీతిపై ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.రాష్ట్రంలో తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, రవాణా శాఖ కార్యాలయాలు అవినీతి అడ్డాలుగా మారాయనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వలపన్ని అవినీతి అధికారులను పట్టుకుంటూ, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వారిపై అక్రమాస్తుల కేసులు నమోదు చేస్తున్నారు.
ఇటీవల అందిన సమాచారం మేరకు మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం కిషన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు.
హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. కిషన్ నాయక్తో పాటు మరో నలుగురు అధికారుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.సోదాలు పూర్తైన తర్వాత పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ దాడులతో అవినీతి అధికారుల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.
