
వచ్చే నెల న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరయ్యే అవకాశం ఉందన్న వార్తలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఆయన పర్యటన ఖరారైతే దాదాపు ఏడేళ్ల తర్వాత జిన్పింగ్ భారత్లో పర్యటించినట్లవుతుంది. 2020 గల్వాన్ ఘర్షణల అనంతరం భారత్-చైనా సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో జిన్పింగ్ భారత్ పర్యటనపై చర్చ జరుగుతోంది. జిన్పింగ్తో పాటు సుమారు 400 మంది అధికారులు, ప్రతినిధులతో కూడిన భారీ బృందం న్యూఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 2019లో జిన్పింగ్ భారత్ పర్యటన సందర్భంగా ఆయన వెంట వచ్చిన బృందంలో 200 మందికి లోపే ఉన్నట్లు సమాచారం. ఈసారి దాదాపు రెట్టింపు సంఖ్యలో ప్రతినిధులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
చైనా అధికారులు ఇప్పటికే న్యూఢిల్లీలో బస ఏర్పాట్లు, భద్రతా ప్రోటోకాల్స్ తదితర అంశాలపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అయితే జిన్పింగ్ పర్యటనపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
భారత్ ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబరు 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. జిన్పింగ్ హాజరు ఖరారైతే బ్రిక్స్ సహకారం అంతర్జాతీయ అంశాలతో పాటు భారత్-చైనా సంబంధాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపైనా ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.
జిన్పింగ్ పర్యటనపై అడిగిన ప్రశ్నలకు చైనా విదేశాంగ శాఖ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బ్రిక్స్ సహకారానికి చైనా ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, ఈ ఏడాది సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు భారత్కు మద్దతు ఇస్తామని పేర్కొంది. అయితే జిన్పింగ్ భారత్ పర్యటనకు సంబంధించి ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది.
