
DNews: సామాన్యులకు లేవు.. ఎండీఆర్పై కేంద్రం క్లారిటీ, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక స్పష్టత ఇచ్చారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారుల నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయబోమని ఆమె తెలిపారు. భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేసినా.. అది వినియోగదారులకు కాకుండా ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి సాధారణ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయని నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ఇకపై కూడా ప్రజలు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు లేకుండా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం నేరుగా వినియోగదారుల నుంచి పన్ను లేదా ఛార్జీ వసూలు చేసే ప్రతిపాదన లేదన్నారు.
చిన్న దుకాణాలు, రోడ్డు పక్కన వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థల వద్ద జరిగే తక్కువ విలువైన లావాదేవీలకు ఎలాంటి భారం లేకుండా ఉచిత యూపీఐ చెల్లింపులు కొనసాగించే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
అసలు ఎండీఆర్ అంటే ఏంటి?
మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అంటే డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యాపారులు చెల్లించే రుసుము. ఈ మొత్తాన్ని సాధారణంగా బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర చెల్లింపు వ్యవస్థల మధ్య పంచుకుంటారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై జీరో ఎండీఆర్ విధానం అమల్లో ఉంది. అంటే కస్టమర్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపు స్వీకరించినప్పుడు వ్యాపారి ఎలాంటి ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానం దేశంలో డిజిటల్ చెల్లింపుల విస్తరణకు దోహదపడింది.
అయితే యూపీఐ వినియోగం భారీగా పెరగడంతో దాని నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నియంత్రణ, సాంకేతిక మౌలిక వసతులపై ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వ్యాపార లావాదేవీలకు ఎండీఆర్ విధించే అంశంపై చర్చ జరుగుతోంది.
పార్లమెంటు ఆమోదించిన పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు 2026 ద్వారా యూపీఐ, రూపే డెబిట్ కార్డు వంటి డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో ఎండీఆర్కు సంబంధించిన విధానాన్ని రూపొందించే అవకాశం కల్పించారు. అయితే దీనివల్ల సాధారణ యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు పడవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భవిష్యత్తులో ఎండీఆర్ను అమలు చేయాలా? చేస్తే ఏ రకమైన లావాదేవీలకు వర్తింపజేయాలి? అనే అంశాలను సంబంధిత వ్యవస్థలు నిర్ణయిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులపై అదనపు భారం పడకుండా విధానాన్ని రూపొందించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.
