
కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గతంలో మాదిరిగా ఇకపై ఎక్కువగా పనిచేయలేనని, కొత్త తరానికి బాధ్యతలు అప్పగించి వారికి అవకాశాలు కల్పించాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని గుర్తు చేసుకున్నారు. గతంలో పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో విస్తృతంగా పనిచేశానని, ఇప్పుడు తన క్రియాశీల పాత్రను క్రమంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
యువతకు బాధ్యతలు అప్పగించి వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించాలన్న అభిప్రాయాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. ఇకపై పాలనాపరమైన ఒత్తిళ్ల కంటే సామాజిక సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమంపై ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
మహారాష్ట్రలోని ఏ గిరిజన గ్రామమూ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉండకూడదన్న లక్ష్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘చేసినంత కాలం చేశాను ఇప్పుడు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి’’ అని గడ్కరీ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వార్తలు వస్తున్న సమయంలో గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీలో తరాల మార్పుపై ఇప్పటికే జరుగుతున్న చర్చకు ఆయన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి.
