
D Spiritual: Dec 26: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల, తిరుపతి నగరం, అలాగే జిల్లాలోని ఇతర ఆలయాల్లో భక్తుల సౌకర్యం, శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని వారు వెల్లడించారు.
తిరుమలలో సుమారు 3 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. అదనంగా తిరుపతిలోని బస్టాండ్, అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.
డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రదేశానికి హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు. ఇతరులకు ఎలాంటి అనుమతి ఉండదని తెలిపారు.
ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ టోకెన్లతో భక్తులను మోసం చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. నకిలీ టోకెన్లతో వచ్చిన వారికి దర్శనానికి అనుమతి ఇవ్వబోమని, ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భక్తులు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వదంతులను నమ్మకుండా, టీటీడీ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాలు, ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారం పొందాలని అధికారులు సూచించారు.
